5th Day Bala Kanda (5 వ దినము బాల కాండ.)

5th Day Bala Kanda

(5 వ దినము బాల కాండ.)

ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ” పూర్వం కృత(సత్య

ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ” పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు,

దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళి ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళి చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.

అప్సు నిర్మథనాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః |
ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ ||
షష్టిః కోట్యో అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం |
అసంఖ్యేయాః తు కాకుత్స్థ యాః తాసాం పరిచారికాః ||

అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు. తరువాత అందులోనుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు, రాక్షసులు ఆ సురరాసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడు సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు, అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరవాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు, చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.

కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది………నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు సౌచంగా( భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరాలు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు.

దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దెగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మ అన్నాడు. దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు, రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఒక రోజు, మిట్ట మధ్యాహ్నం వేళ, దితి తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది, అప్పుడామె జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె సౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది, ఆ ఏడుపు దితికి వినబడి, దితి కూడా నరకద్దు అని అనింది. అప్పుడు ఇంద్రుడు బయటకి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నాయందు సౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు, కాని నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కంధాలకి అధిదేవతలగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని, ఇంద్రలోకంలోని, అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు.

రామా! ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుడికి సృంజయుసుడు, సృంజయుసుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు, ఆ సుమతి ఇప్పుడు ఈ విశాలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు.

తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకొన్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితొ నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, సూర్యచంద్రులులాగ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామలక్ష్మణులంటారు, దశరథుని కుమారులు, నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి, కుశల ప్రశ్నలు అడిగాక అక్కడినుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దెగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది, కాని అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పెను……

గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీత్ మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః ||

ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది, ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన, ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో, గౌతమ మహర్షి  వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు.

ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్ ||

అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు, కాని ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది, అందువలన ఇంద్రుడితో సంగమించింది.

అహల్య ఇంద్రుడితో ఇలా అనింది ” నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలినయ్యాను, నువ్వు ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపో. నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో ” అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందంపొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే……

గౌతమం స దదర్శ అథ ప్రవిశంతం మహామునిం |
దేవ దానవ దుర్ధర్షం తపో బల సమన్వితం ||

దేవతలని, దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపఃశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు ” నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం, కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవు గాక ” అని ఇంద్రుడిని శపించారు.

పేతతుః వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ |

అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు ” నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహరం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది, కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీకు శాపవిమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జెరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షి తపఃశక్తి పెరిగిపోతుంది, ఆయనని నేను ఏమి చెయ్యలేను, అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను, ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను, అహల్యని శపించడం వల్ల కొంత తపఃశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను, కావున మీరే నాకు అండాలని తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణములను తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమం లోకి వెళ్ళగానే, ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు.

తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునేవాళ్ళతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌవరంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులని చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు, ఖడ్గాలు, కొదండాలు పట్టుకున్నారు, సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు, ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకి వాళ్ళు ఎవరు అని అడిగారు.

వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు, నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయ్యింది అని విశ్వామిత్రుడు చెప్పాడు.

అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశార అని శతానందుడు వాళ్ళని అడిగాడు.

పతితపావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాపవిమోచనం అయ్యింది, ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు.

శతానందుడు ఎంతో సంతోషించాడు……… “రామ! నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది, అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావ. మా అమ్మ సంతోషంగా ఉందా ” అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు…. మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళారు అని చెప్పాడు.

రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు…….

న అస్తి ధన్యతరో రామ త్వత్తో అన్యో భువి కశ్చన |
గోప్తా కుశిక పుత్రః తే యేన తప్తం మహత్ తపః ||

” విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడవి అయ్యావు, ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను ” అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు.

Thank you for watching 5th Day Bala Kanda (5 వ దినము బాల కాండ.)

Leave a Reply

error: Content is protected !!