ఆది పర్వము ప్రథమాశ్వాసము-1(మహా భారతం):

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడికి భక్తితో నమస్కరించి తొలి పూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆదిదేవుడు కాపాడుతాడని అందరి నమ్మకం.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాధుని ఆశీర్వాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మహాభారతం మీకు అందినస్తున్నాం .
ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.
ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.
రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్
ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది. 

ప్రథమాశ్వాసము 1:

అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు
ప్రవేశిక :
పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కురుంక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్య, ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు. అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు. సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి జనమేజయా ! నీకుమారులు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుడిని కొట్టారు. రాజా ! యుక్తా యుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి. అని పలికి అక్కడి నుడి వెళ్ళిపోయింది. యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్థినాపురం పోయిన తరువాత ఒక రోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపక పోయినట్లైతే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి అని ప్రార్ధించాడు. అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేసాడు.
అవతారిక :
శౌనకుడు నైమశారణ్యంలో సత్రయాగం చూస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగశ్రవసుడు అను సూతుడు వచ్చాడు. సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణకథలు చెప్పటంలో సిద్ధహస్థుడినని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవసువునకు తెలిపారు. ఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు. తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవతకథ, అణు, ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేసాడు. ఈ మహా భారతం గ్రంధాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మ జ్ఞానులు వేదాంతమని, నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వ లక్షణ గ్రంధమని అంటారు. ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలలో చెప్పుటకు శుకమహర్షిని, మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు. వైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను.
Thank you for watching ఆది పర్వము ప్రథమాశ్వాసము-1(మహా భారతం)
And follow us on Facebook

Leave a Reply

error: Content is protected !!